ఇప్పటి వరకూ కరోనా రోగుల చికిత్సలో బాగా ఉపయోగపడుతుందనుకుంటున్న రెమిడిస్వేర్ మందు వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని తేలింది.
రెమిడిస్వేర్ ఒక్కటే కాదు హడ్రాక్సీ క్లోరో క్విన్, లోపిన్వేర్, ఇంటర్ఫెరాన్ లాంటి మందులు కూడా కరోనా మరణాలను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయని పరిశోధనలో వెల్లడి అయింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పీడితులపై వినియోగిస్తున్న ఈ నాలుగు యాంటీ వైరల్ డ్రగ్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన నిర్వహించింది.
మార్చి 22 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
మొత్తం ప్రపంచంలోని 30 దేశాలలో ఉన్న 405 ఆసుపత్రులలో 11,266 మంది రోగులపై పరిశోధన నిర్వహించగా ఈ నాలుగు మందులు వారిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని, వారి మరణాన్ని అడ్డుకోలేకపోయాయని తేలింది.
వెంటిలేటర్ పై ఉంచిన వారికి ఈ మందులు ఇస్తున్నారని అవి ఎలాంటి ప్రభావం చూపకపోవడం వల్ల కరోనా రోగులు మరణిస్తున్నారని పరిశోధకులు వెల్లడించారు.
ముందుగా వాడినా కూడా కరోనా రోగిని వెంటిలేటర్ వరకూ తీసుకువెళ్లే పరిస్థితి తప్పడం లేదని, అందువల్ల ఈ మందు పని చేయడం లేదనే విషయం వెల్లడి అవుతోందని వారు వివరించారు.