టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత, దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ అదేశాల మేరకు కాగజ్ నగర్ పట్టణ MRO కార్యాలయం వద్ద ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ తో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం దళితుల అణచివేతకు తాజాగా మరో ఉదాహరణ అని ఆయన అన్నారు. తన 13 గుంటల భూమిని లాక్కుంటున్నందుకే చచ్చిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోందని డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు.
దళితులకు ఉచితంగా 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం, ఉన్న భూమిని కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణం అని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా నింపడానికి వెళ్తున్న బిజెపి నాయకులను మార్గమధ్యలోనే అడ్డగించి, అరెస్టు చేయడం టీఆర్ఎస్ నియంతృత్వ వైఖరికి అద్దం పడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో ఓ దళితుడిని టీఆర్ఎస్ వార్డు మెంబర్ హతమార్చాడని ఆయన తెలిపారు. అంతకు ముందు యచారం దళిత ఎంపీపీ, మహిళపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సమక్షంలో దాడులు, మరో దళిత బాలికపై అఘాయిత్యం ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల దారుణాలు అనేకం ఉన్నాయని ఆయన అన్నారు.
బిజెపి నాయకులను అడ్డుకుంటున్న ప్రభుత్వం
అంతేకాదు బాధితులను ఓదార్చి అండగా ఉండే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బిజెపి నాయకులను అడ్డుకోవడం, అక్రమ అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం వంటి వాటికి పాల్పడుతోందని శ్రీనివాస్ అన్నారు. కనీసం ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు కూడా ప్రభుత్వం హరించివేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతుందని ఆయ అన్నారు.
ఎన్ని నిర్బంధాలకు గురి చేసిన దళిత వ్యతిరేక టీఆర్ఎస్ పై బిజెపి పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ, జిల్లా కార్యదర్శి దాగామ్ ధీలిప్, జిల్లా బి.జె.వై.ఎం ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గాంధార్ల రాజశేఖర్, మాచర్ల శ్రీనివాస్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి దొంగ్రీ అరుణ్, జిల్లా బి.జె.వై.ఎం ఉపాధ్యక్షుడు మందాడే సుధాకర్, మండల ఉపాధ్యక్షుడు రణబీర్ బిస్వాస్, నాయకులు శరద్ శర్మ, పట్టణ కార్యదర్శి రాంజతన్ సింగ్, మైనారిటీ అధ్యక్షుడు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.