కైలాష్ మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బీజింగ్లో చైనా వైస్ విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్తో సమావేశమైన తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఈ యాత్రకు రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను పునరుద్ధరించడానికి కూడా అంగీకారం కుదిరింది.
2025 వేసవిలో కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం దీన్ని అమలు చేయడానికి సంబంధించిన విధివిధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తుంది” అని కూడా తెలిపింది. ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ (1981 నుండి), సిక్కింలోని నాథు లా పాస్ (2015 నుండి) రెండు అధికారిక మార్గాల ద్వారా యాత్ర జూన్ మరియు సెప్టెంబర్ మధ్య జరుగుతుంది.
కోవిడ్ వ్యాప్తి మరియు చైనా వైపు యాత్ర ఏర్పాట్లను పునరుద్ధరించకపోవడంతో 2020 నుండి యాత్ర జరగలేదు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో భారతదేశం మరియు చైనా మధ్య ప్రత్యక్ష విమానాలు 2020లో నిలిపివేశారు. ఇదిలా ఉండగా, సరిహద్దు నదులకు సంబంధించిన జలసంబంధ డేటా మరియు ఇతర సహకారాన్ని పునఃప్రారంభించడంపై చర్చించడానికి భారతదేశం-చైనా నిపుణుల స్థాయి మెకానిజం ముందస్తు సమావేశాన్ని నిర్వహించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
బ్రహ్మపుత్ర నది అప్స్ట్రీమ్ బెల్ట్లో చైనా ఆనకట్ట ప్రాజెక్టుపై భారతదేశం భయపడుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మిస్రీతో మాట్లాడుతూ, “చైనా మరియు భారతదేశం ఒకే దిశలో పని చేయాలి. మరింత ముఖ్యమైన చర్యలను అన్వేషించాలి. పరస్పర అవగాహనకు కట్టుబడి ఉండాలి”అని అన్నారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య జరిగిన చర్చలతో సహా పలు ఉన్నత స్థాయి సమావేశాలతో రెండు దేశాల మధ్య సంబంధాలు గత నాలుగు నెలలుగా మెరుగుపడ్డాయి.