తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు.
గత ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ ఆయన సభనుద్దేశించి చెప్పారు.
అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.