రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారి పై దాడి దారుణం అని ఆయన అన్నారు. 5వందల ఎకరాల భూ వివాదంలో ఈ సంఘటన జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల విజయరెడ్డి పై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపునివ్వడం వల్ల ఇలాంటి ఘటనకు పరోక్షంగా తోడ్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రెవెన్యూ శాఖ సీఎం దగ్గరే ఉంది. ఘటన జరిగి 24 గంటలు అయినా సీఎం నివాళి అర్పించేందుకు రాలేదు ఇది దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వ ఉద్యోగులందరు సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. జ్యూడిషియల్ అధికారి విధినిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రకటించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సంఘటన పై రెవన్యూ ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.