రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ చేసింది ఏమిలేదని గతం లో సీఎం ఇచ్చిన హామీలపై త్వరలో రైతు సమాజాన్ని సంఘటితం చేసి తెరాస ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ జరిపిన సమావేశంలో రైతుల ప్రస్తావనే రాలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కనీసం ప్రస్తావించలేదని పేర్కొంటూ సీఎం వైఖరిపై రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో రైతుల ఆత్మహత్యలు, అన్నదాతల కష్టనష్టాలను ప్రస్తావించారు. దాదాపు 11 గంటలపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో 5 నిమిషాలైనా రైతుల గురించి చర్చించేందుకు సమయం దొరకలేదా అన్ని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై చర్చ జరిగితే రుణమాఫీ, రైతుబంధు మద్దతు ధర తదితర పథకాల అమలులో దొర్లుతున్న లోపాలు వెలుగులోకి వస్తాయనే సమీక్ష చేయలేదని రేవంత్ విమర్శించారు.
నేషనల్ క్రైంబ్యూరో రికార్డ్స్(ఎన్సీఆర్బీ) తాజా లెక్కల ప్రకారం అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన ఆరేళ్ల పాలనలో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఈ అధికారిక లెక్కలను చూస్తుంటే రైతుల విషయాల్లో సీఎం చెప్పేవన్నీ అబద్ధాలని అర్థమవుతోందని ఆక్షేపించారు.
రైతుబంధును ఎన్నికల పథకంగా మార్చేశారని ఎన్నికలుంటేనే రైతుబంధు వస్తుందని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. రైతు సమన్వయ సమితి తెరాస నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నారు. సీఎం ఇచ్చిన హామీలపై త్వరలో రైతు సమాజాన్ని సంఘటితం చేసి తెరాస ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.