హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల వారీగా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ ఆయా గ్రామాలు, మండలాలు, నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తోంది.
ప్రధానంగా ఎన్నికల సందర్భంగా నాయకులను సమన్వయం చేసి పార్టీకి క్రియాశీలకంగా పని చేయించడంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మండలాల వారీగా ప్రచారం నాయకుల మధ్య సమన్వయం, ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలు వేయడంలో ముందుండి పని చేస్తున్నారు. కాగా ఈ నెల 23, 24, 26 తేదీలలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజక వర్గంలో జరపతలపెట్టిన సమావేశాల పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎంపీ లో పొన్నం ప్రభాకర్, మల్లు రవిలు ఒక ప్రకటన చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి మంచి ఆదరణ ఉందని బీజేపీ, టిఆర్ఎస్ లకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధానంగా పెద్దఎత్తున ఉన్న నిరుద్యోగ యువత, రైతులను లక్షంగా చేసుకొని కాంగ్రెస్ ప్రచార ప్రణాళికలు చేస్తున్నారు.