హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్ కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను నాయకులతో చర్చించిన రేవంత్ రెడ్డి కార్యకర్తలకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని, బీజేపీ, టిఆర్ఎస్ ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వివరించాలని ఆయన కోరారు.
జూమ్ మీటింగ్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.