హైదరాబాద్ శివారులోని కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 151, 152 లో గల కస్టోడియన్ భూములను కాపాడడానికి కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలోని రెవెన్యూ యంత్రాంగం కదం తొక్కింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే ఆరు జెసిబి సహాయంతో, కబ్జా కి గురైన కస్టోడియన్ భూమిలో కబ్జాదారులు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ నీ తొలగించి, ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారి కోర్టుని తప్పుదోవ పట్టించిన, సదరు కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని పరిరక్షించడం కోసం, భారీ పోలీసు మరియు స్పెషల్ ఫోర్స్ బలగాలతో గురువారం ఉదయం నాలుగు గంటల నుండే కాప్రా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, కాప్రా లోని కబ్జాలకు గురవుతున్న దాదాపు 13 ఎకరాలలో వందల కోట్ల విలువ చేసే కస్టోడియన్ ప్రభుత్వ భూమిని, కబ్జాదారుల చెర నుండి పరిరక్షించి ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని అన్నారు.
ఇకపై ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాల కి పాల్పడుతున్న వారు, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ స్థలాలలో కబ్జాదారుల మోసపూరితమైన మాటలను నమ్మి, అమాయకమైన ప్రజలు ప్లాట్లు కొని మోసపోవద్దని ఆయన తెలిపారు.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కూల్చివేతలో కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ తో పాటు, ఇంచార్జ్ ఆర్డిఓ మల్లయ్య,కుషాయిగూడ ఏసిపి శివ కుమార్, డి ఐ మధు కుమార్, జవహర్ నగర్ సి ఐ,పి బిక్షపతి రావు, ఎస్సైలు మోహన్, సాయిలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని, రమేష్, వీఆర్వో సత్యనారాయణ, విజయ్ కుమార్, గంగాధర్, సర్వేయర్ ఇతర రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు