కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ లలో పౌరుల కనీస అవసరాలను తీర్చడం పైన ప్రధాన దృష్టి సారించాలని రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.
కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్మశాన వాటికలు, పార్కులు, జంక్షన్లలో అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆయన కోరారు.
అదే విధంగా కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్ ని సిద్ధం చేయాలని, రెండు కార్పొరేషన్లు వాటర్, ఎనర్జీ ఆడిటింగ్ రానున్న 15 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి కోరారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని కేటీఆర్ కోరారు.
ఈ పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాల తోపాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, అవకాశం ఉన్న ప్రతి చోట ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ పద్దతుల పైన సమీక్ష నిర్వహించుకుని ఆదర్శవంతమైన పద్ధతులను అందిపుచ్చుకోవాలని, రెండు పట్టణాలు ఆధునిక స్లాటర్ హౌస్ లను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు.