మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎం.ఎల్.సి. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని బి.ఎల్.ఓ.లను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు.
సోమవారం ఆర్.డి.ఓ. కార్యాలయం సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారుల (బి.ఎల్.ఓ) తో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ నెల 7వ. తేదీలోపు ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తిచేయాలని, ప్రతి ఓటరు స్లిప్పుల పంపిణీ వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు సమర్పించాలని బి.ఎల్.ఓ. లకు ఆమె సూచించారు.
వనపర్తి జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు పురుషులు 14,355 మంది, స్త్రీలు 6,802 మంది, ట్రాన్స్ జెండర్ ఒకరు (1), మొత్తం ఓటర్ల సంఖ్య 21,158 ఓటర్లు నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అంతేకాక ఎన్నికలు నిర్వహించేందుకు (31) పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని బి.ఎల్.ఓ.లకు ఆమె సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, ఆర్.డి.ఓ. అమరేందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, బి.ఎల్.ఓ.లు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి