ఆయుష్ ,యునాని ఆయుర్వేదిక్, హోమియోపతి ఆస్పత్రుల డాక్టర్ల పనితీరును మెరుగుపరుచుకొని, ఈ సంప్రదాయ వైద్యాన్ని పేద ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయుష్షు డాక్టర్లను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని 19 ఆయుష్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి విభాగాల సేవల పనితీరుపై మెడికల్ అధికారులు ఆయుష్ ఆస్పత్రుల సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ నిర్వహించారు.
విభాగాల వారీగా ఆయుర్వేదం, యునాని, హోమియోపతి డాక్టర్ల పనితీరు, రోజువారీ ఓపిల రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం ఆయుర్వేదం, యునానీ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఆయుర్వేదం, యునానీ, హోమియోతి వంటి వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు ప్రాధాన్యతనిచ్చింది అన్నారు.
జిల్లాలోని ఆయుష్ కేంద్రాల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదని అసంతృప్తిని వ్యక్తపరిచారు. పని తీరును మార్చుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సంప్రదాయ వైద్యం పై నమ్మకం ఉందని,వాటిని నిలబెట్టే విధంగా పని చేయాలన్నారు. జిల్లాలోని కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో పనిచేయని కేంద్రాలను జిల్లా ఆస్పత్రికి మార్చి
నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వైద్య సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆయుష్ కేంద్రాల్లో యోగ షెడ్ల నిర్మాణానికి 1 కోటి 14 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు కలెక్టర్ వెల్లడించారు.
వాటి నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయుష్ ఆస్పత్రులలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని , ఆసుపత్రులకు వచ్చే రోగులను ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించాలని సూచించారు. ప్రజలు, రోగుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవలందించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు.
జిల్లాలో ఆయుష్ సేవలను మెరుగు పరిచేందుకు తను ఆకస్మిక తనిఖీలకు వస్తానని వెల్లడించారు. ఆయుష్ వైద్యులు తమ పనితీరును మెరుగు పరచుకోకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ అధికారులు తనతో ముందస్తు పర్మిషన్ తీసుకుని సెలవులు పొందాలన్నారు. నేటి సమావేశానికి హాజరుకాని వెల్దండ, ఎల్లికల్, పెద్ద కొత్తపల్లి వైద్యుల ఒకరోజు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ సూర్య నాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, ఈఈ పిఆర్ దామోదరరావు, డిఈ దుర్గాప్రసాద్, ఆయుష్ కేంద్రాల మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్