విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపే పోలీస్ సిబ్బందికి సేవ పతకాలతో సత్కరిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ విధులలో ప్రతిభ చూపిన 90 మంది పోలీస్ సిబ్బందిని ప్రశంస పత్రాలతో పోలీస్ కమిషనర్ సన్మానించారు. స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు…పోలీస్ శాఖ లో పని చేస్తున్న ప్రతిఒక్కరికి పని విభజన చేసి ఖచ్చితమైన బాధ్యతలు అప్పగించటం, తద్వారా జవాబుదారీతనం, వ్యక్తిగత సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఈ ఫంక్షనల్ వర్టికల్స్ జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో బాధితులతో ప్రవర్తించే తీరు సమస్యలు పరిష్కరించడంలో ప్రతి స్పందించే విధానం పోలీస్ వ్యవస్థపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుందని, అందుకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ విభాగాల్లో రోజువారీగా నిర్వహించే విధులను విభజించి పోలీస్ విధులు క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ ఆఫీస్ గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ కౌంటర్, సెక్షన్ ఇంచార్జ్, టెక్ టీమ్, బ్లూకోల్డ్, కోర్టు, క్రైం రైటర్స్ , స్టేషన్ రైటర్స్ ,పెట్రోలింగ్, ఆడ్మిన్, డిటెన్షన్ ఆఫీసర్ ఇలా 14 ఫంక్షనల్ వర్టికల్స్ లో పోలీస్ సిబ్బందికి పనితీరు అధారంగా ప్రశంస పత్రాలు, సేవ పతాకాలు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా అవినీతి ఆరోపణలను వస్తే ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.