హుజూర్ నగర్ పట్టణంలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్నందున కార్మికులకు పది రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలని సి ఐ టి యు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఐఎన్టీయూసీ, సి ఐ టి యు కార్మిక విస్తృతస్థాయి సమావేశంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుందని అన్నారు.
హుజూన్ నగర్ పట్టణంలోని ప్రజలందరికీ కరోనా వైరస్ టెస్టులు ఉచితంగా చేయాలని ఆయన అన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ధ్వజ మెత్తారు. కనీసం ఆరు నెలల పాటు ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని, సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం స్థానిక రైసు మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రామ్ నాగేశ్వరరావు, కార్యదర్శి సిరికొండ శ్రీనివాస రావుకు సెలవు దినాల వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు ఎలగంటి జానయ్య, సైదులు, నాగరాజు, కొండలు, సి ఐ టి యు నాయకుడు గుండెబోయిన వెంకన్న, రాములు, లాలయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.