ములుగు జిల్లా మంగపేట మండలం శనగకుంట ఆదివాసీ గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన గ్రామస్థులకు నర్సంపేట డివిజన్ రైస్ మిల్లర్లు అసోసియేషన్ అండగా నిలిచింది. ప్రమాదంలో నష్టపోయిన ఆదివాసీలకు వివిధ రకాలైన వస్తువులతో సహాయం అందజేశారు.
గురువారం సాయంత్రం 7 గంటలకు అదుపు చేయలేని మంటలు వ్యాపించి ప్రజలు సర్వం కోల్పోయారు. బలంగా గాలులు వీచిన సమయంలో గ్రామస్థులు తేరుకునే లోపల సర్వం కళ్ళ ముందే బూడిద అయింది. సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి సుమారు 3 లక్షల 50 వేల రూపాయల విలువగల వస్తువులు పంపిణీ చేశారు. కూరగాయలు, నెల రోజులకు సరిపడే బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువులతో పాటు, చీరెలు, లుంగీలు, తువాళ్ళు, చెద్దర్లు, వంటపాత్రలు, నీళ్ళ టిన్నులు నీడ కోసం టార్ఫాలిన్ కవర్లు అందజేశారు. చదువుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమం నర్సంపేట డివిజన్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగస్వామ్యులుగా డివిజన్ అధ్యక్షులు ఇరుకు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విభూతి శివకుమార్, ట్రెజరర్ కొమాండ్ల భూపాల్ రావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య,వరంగల్ జిల్లా అధ్యక్షులు తోట సంపత్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల రవీందర్ ట్రెజరర్ టి.యుగేందర్,కార్యవర్గ సభ్యులు మాధారపు చంద్రశేఖర్,శ్రీరామ్ ఈశ్వరయ్య మరియు భూపాలపల్లి జిల్లా సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య,ఏటూరునాగారం ఖండ సేవా ప్రముఖ్ ఇప్పలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.