రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి వినతి పత్రం పత్రం సమర్పించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రం బయట సీఎంఆర్ జరుగనుందనే వార్తల నేపథ్యంలో సీఎంఆర్ రాష్ట్ర మిల్లర్లకే ఇవ్వాల్సిందిగా నేడు మంత్రిని కలిసి కోరారు. 2021-22 వానాకాలంకు సంబంధించి మందకొడిగా జరుగుతున్న మిల్లింగ్ పై అసోసియేషన్ లో చర్చించి త్వరితగతిన మిల్లింగ్ చేపట్టాల్సిందిగా నిర్ణయించామని, గత వానాకాలం సీఎంఆర్ సైతం నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని, రాబోయే వానాకాలం ధాన్యం సైతం రాష్ట్రంలోని మిల్లర్లకే కేటాయించాలని కోరారు.
అలాగే గత యాసంగికి సంబంధించి బాయిల్డ్ రైస్ వేగంగా ఇస్తున్నామని, ఎప్.సి.ఐ సైతం వెంటనే తీసుకొనేలా చర్చలు జరపాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా సహకరిస్తామని మిల్లర్లు తెలియజేసారు. ఈ సందర్భంగా వారి వినతిని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్, ప్రతినిధులు సంతోష్ కుమార్, శ్రీరాములు, శివ, రాజేందర్ గౌడ్, శశిధర్ తదితరులున్నారు.