కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి శివారులో వలస కార్మికులు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో వెళ్తున్న 21 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 21 మంది కార్మికులలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.
ఇందులో సుదేశ్వర్ రామ్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఐదుగురు కార్మికుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారు. ఈ కార్మికులందరు జార్ఖండ్ రాష్ట్రం గడ్వాల్ జిల్లాకు చెందిన వారే. వీళ్ళందరు సికింద్రాబాద్ లోని శంకర్ పల్లి కన్ స్ట్రక్షన్ కంపనీలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామలకు వెళ్ళడానికి నడుచుకుంటూ వస్తుండగా మధ్యలో టాటా మ్యాజిక్ వాహనాన్ని మాట్లాడుకుని అందులో బయలు దేరారు.
సదాశివనగర్ మండలం దగ్గి శివారులోకి రాగానే టైర్ పేలి వాహనం బోల్తాపడింది. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి, సదాశివ నగర్ సిఐ వెంకట్, ఎస్సై నరేష్ లు జిల్లా ఆస్పత్రికి చేరుకుని కార్మికుల వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చూసుకుని దర్యాప్తు చేస్తున్నారు.