అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణం తీశాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మిరుదొడ్డి మండలం కొండాపూర్ కు చెందిన రాజమౌళి (53) అనే వ్యక్తి మరణించాడు. రాజమౌళి సిద్దిపేట నుంచి కొండాపూర్ కి బైక్ పై వెళుతుండగా తిమ్మాపూర్ సమీపంలో హై స్కూల్ దగ్గర మెదక్ నుంచి సిద్దిపేట కు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.
డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతో రాజమౌళి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజమౌళి మృతి తో ఆ ఊర్లో విషాద చాయలు అలుముకున్నాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.