రాజధాని అమరావతి లో రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు సుడిగాలి పర్యటన చేశారు. సుమారు నాలుగు గంటలపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. 16 వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే E 11,E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వెంకట పాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను కూడా మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.
గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చాం. ఇప్పటికే 22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది. మరో 20 వేల కోట్లకు సోమవారం జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటాం. 217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి18 రోడ్లు వస్తున్నాయి. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నాం.
సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం. ఈ రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఎక్కువ ఇళ్లు డ్యామేజి కాకుండా రోడ్ల డిజైన్లు చేస్తున్నాం. E11 రోడ్డు ఎయిమ్స్ పక్కన సర్వీసు రోడ్డులో కలుస్తుంది. E13 రోడ్డు డీజీపీ ఆఫీస్ పక్కన కలుస్తుంది. రెండు రోడ్లపై గంటకు 80 నుంచి100 కిమీ వేగంతో వెళ్ళేలా డిజైన్ చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారు సహకరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లు కోల్పోతున్న వారితో మాట్లాడతారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తాం అని అన్నారు.