రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. వర్షాలు బాగా కురుస్తున్నాయి. కాలవలు బాగా పారుతున్నాయి. రైతుబంధు డబ్బులు కూడా వచ్చాయి. అందువల్ల రైతులు ఉత్సాహంగా తమ పంట పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. పైన ఫొటో చూసి ఇదే అనుకుంటున్నారా? పైన చెప్పిన విషయాన్ని మీరు అనుకుంటుంటే మీరు తప్పులో కాలేసినట్లే.
ఇది రోడ్డు. పంట పొలం కాదు. రోడ్డు మీద కంకర, తారు వేయడం కాదు కదా కనీసం మట్టి కూడా పోయడం లేదు. దాంతో వర్షం కురిసినప్పుడల్లా ఈ రోడ్డు పై నీరు నిలుస్తున్నది. పక్కన సైడు కాల్వలు కూడా లేకపోవడంతో నీరు అక్కడే నిలబడిపోతున్నది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం,పెద్ద కొత్త పల్లి మండలం యాపట్ల గ్రామంలో పరిస్థితి ఇది. ఎన్ని సార్లు అధికారులతో, ప్రజా ప్రతినిధులతో మొత్తుకున్నా వినే నాథుడే లేడు. ఇప్పుడు వర్షం బాగా కురుస్తున్నందున రోడ్లు సక్రమంగా లేక వర్షం నీరు నిలవడంతో నిరసన తెలుపుతూ రోడ్ల మీదనే గ్రామస్తులు నాట్లు వేస్తున్నారు.
అయ్యా అధికారులూ ఇప్పటికైనా ఇలాంటి గ్రామాల కష్టాలు తీరుస్తారా? పల్లె ప్రగతి, పట్నం ప్రగతి అంటూ ఉపన్యాసాలు చెబుతూ కూర్చుంటారా?