వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలో కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, ముఖ్యమంత్రితో చర్చించి వాటి పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సమావేశంలో ఆయన నేడు మాట్లాడారు. రాష్ట్రం లో రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
మార్చి నెలాఖరు లోపు మరమ్మత్తులు పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు. అదే విధంగా కాంట్రాక్టర్లకు రూ. 450 కోట్ల బకాయిలు చెల్లింపు చేయడానికి నిర్ణయించామని ఆయన తెలిపారు.
నివర్ తుఫాన్ వల్ల నష్ట పోయిన ప్రాంతాలకు ప్రత్యేకంగా రహదారుల నిర్మాణానికి రూ. 200 కోట్లు నిర్దేశించామని మంత్రి తెలిపారు.
అదే విధంగా రూ. 1150 కోట్లు నాబార్డ్ ద్వారా నిధులు వస్తున్నాయని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు ఏపీఎస్ ఆర్టీసీ కి ఇవ్వాల్సిన 3 వేల కోట్లు పక్కదారి పట్టించాయని మంత్రి అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రతి గ్రామానికీ రోడ్ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ సుందరికరణకు, రోడ్ల అభివృద్ధికి నిధులు అందిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రవాణా శాక కార్యదర్శి టి కృష్ణ బాబు మాట్లాడుతూ పెందుర్తి కొత్తవలస కు ఐదు కోట్లు నిధులు ఇచ్చామని తెలిపారు.
పెందుర్తి నుంచి భోడారా కూడలి జాతీయ రహదారి గా మార్చడానికి ప్రతిపాదనలు పంపామని ఆయన అన్నారు.
అదే విధంగా షీలా నగర్ నుంచి సబ్బవరం 12 కిలోమీటర్లు రహదారి నిధులు కూడా మంజూరు చేసామని, స్థల సేకరణ పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.
బీచ్ డ్రైవ్ లా… నేషనల్ హై వే నుంచి గొస్తని నదిపై ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.