రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆధ్వర్యంలో నేడు బీరెల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమాలను ఈ నెల 20 వరకూ ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని కోరారు.
వాహనదారులు ముందు చూపుతో ప్రమాదాలు నివారించవచ్చునని, ప్రతి ఒక్కరు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు చూసుకుని రోడ్లు దాటాలని కోరారు. అతివేగం, అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరిగి ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ పి సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని అన్నారు. మద్యం మత్తులో వాహనం నడపకూడదని, అతివేగంగా వాహనం నడపరాదని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం నేరమని, ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ తప్పక ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ను తప్పక ధరించాలని సూచించారు.
కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులు ఫోన్ చేయాలని లేదా నిర్మల్ జిల్లా వాట్స్అప్ నెంబర్ 8333986939 లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామంటూ ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డి.యస్.పి ఉపేందర్ రెడ్డి, గ్రామీణ సి.ఐ. శ్రీనివాస్ రెడ్డి, గ్రామీణ ఎస్.ఐ. రాంనర్సింహ రెడ్డి, గ్రామ సర్పంచ్, యంపిటీసీ, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.