కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గతంలో వారధి పనులకు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కానీ ఈ వారది పిల్లర్లలో రెండులో ఒకటి నిర్మించి ఒకటి వదిలేయడంతో సమస్య ప్రారంభం అయింది.
ఆరేళ్ల నుండి ఈ సమస్య ఇలాగే కొనసాగుతూనే ఉంది. రెండవ వారధి నిర్మాణానికి పిల్లర్ల స్థాయి వరకు నిర్మించి కాంట్రాక్టర్ తప్పుకోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గత సంవత్సరం వర్షాకాలంలో మూడు సార్లు ఈ తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో జూకల్ నియోజకవర్గం కేంద్రం నుండి ఉమ్మడి నూతన జిల్లా కేంద్రాలైన నిజామాబాద్, కామారెడ్డితో పాటు డివిజన్ బాన్సువాడ వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఒక్కటే నెలలో మూడు సార్లు ఈ తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో మండలంలోని చిన్న దడిగి, పెద్దదడిగి, మానేపూర్, సీతారాంపల్లి, రాజాపూర్, బండరెంజల్ మీదుగా బాన్సువాడకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు వ్యయంతో పాటు సమయం కూడా వృథా అయిందని నియోజక ప్రజలు తలలు పట్టుకున్నారు.
కానీ నాయకుల తీరులో మాత్రం మార్పు లేదు. మళ్లీ ఈ రోజు బుధవారం నాడు కురిసిన భారీ వర్షానికి ఈ రోడ్డు తెగి పోతుందన్న వార్త సత్యం న్యూస్ లో ప్రకటించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడిప్పుడే ఉన్న రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.
దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు మళ్లీ అదే అవస్థలు ఎదుర్కోవలసిందే. దీనిపై ఇప్పటికైనా సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని తమ నిర్లక్ష్య వైఖరి వీడి ఈ వారధి పనులను త్వరగతిన పూర్తి చేసి తాత్కాలిక రోడ్డును వెంటనే పునరుద్ధరించి రాకపోకలు కొనసాగించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.