అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ విధులు ప్రశంసనీయంగా ఉన్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అభినందించారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని సదుపాయాలతో 15 స్ట్రెచర్ బెడ్స్ డొనేట్ చేశారు. కలెక్టర్ చాంబర్ ముందు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ కు అందించి ప్రారంభింపజేశారు.
అందుకు కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ కరోనా ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలుగా సహాయం అందించాయని, రోటరీ క్లబ్ కూడా పలు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఆర్మూర్, నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్, సెలైన్ ఇతర సదుపాయాలతో కూడిన స్ట్రెచర్ బెడ్స్ అందించారని ఆయన తెలిపారు.
కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి 100 మందిలో 30 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, సోషల్ మీడియా, ప్రజల సహాయ సహకారం, అవగాహనతో ప్రస్తుతం పది శాతానికి తగ్గిందని కొద్దిరోజుల్లోనే 5 శాతం వరకు వచ్చే అవకాశం ఉందని దీనిని జిల్లాలో పూర్తిగా తగ్గించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వివరించారు.
అదేవిధంగా కోవిడ్ మూడవ దశ కూడా వస్తుందని కూడా చెబుతున్నందున అది రావద్దనే కోరుకుంటున్నానని ఒకవేళ వచ్చినా కూడా దానిని అందరి సహకారంతో ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇందుకై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే దానిని తమ దరికి రాకుండా చూసుకో వచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు దర్శన్ సింగ్, ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.