ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తూ ప్రజల్ని మద్యం మత్తులోకి నెట్టి మరీ తిరిగి వసూలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన తొమ్మిదో లేఖను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. సంపూర్ణ మద్య నిషేధం హామీపై రఘురామకృష్ణంరాజు సిఎం జగన్ ను తన లేఖలో నిలదీశారు.
మద్యం అమ్మకాలు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా మీరు పొందుతున్న అదనపు రెవెన్యూ మద్య నిషేధం జరగట్లేదు అనడానికి నిదర్శనమని ఆయన అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా మహిళలకు మీరు ఇచ్చిన హామీని వమ్ము చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆక్షేపించారు.
మద్యంపై టాక్స్ లు పెంచి పేదవారికి అందకుండా చేయాలనే మీ ఆలోచన విఫలమైంది. అమ్మఒడి ద్వారా పేదలకు మీరిచ్చిన డబ్బు మద్యం ధరల పెరుగుదలతో తిరిగి వసూలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు ఇందుకు నిదర్శనం. అమ్మ ఒడి – నాన్న బుడ్డి పథకం అని ఎగతాళి చేస్తున్నారు అంటూ రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు.
మద్యం ధరలు పెరగడంతో రోజు కూలీలు ఎక్కవ తాగేందుకు తమ కులీ రేట్లు పెంచుకోవాల్సి వస్తున్నదని దీనివల్ల అన్ని రేట్లు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ‘‘వివిధ పథకాల కోసం మీరు చేస్తున్న అప్పులకు తిరిగి చెల్లింపు గ్యారెంటీగా మద్యం రెవెన్యూ నే చూపుతున్నట్టు తెలుస్తోంది.
2020-21 సంవత్సరానికి మద్యం ద్వారా 17600/- కోట్లు ఆదాయం మీ టార్గెట్’’ అని రఘురామకృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మాట మార్చకుండా ఇప్పటికైనా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయండని ఆయన కోరారు.
మద్య నిషేధం హామీని అమలు చేయలేక మీరు మడం తిప్పినట్లయితే చీప్ లిక్కర్ కాకుండా కనీసం నాణ్యమైన మద్యాన్ని అందించండి అని ఆయన సూచించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మన పథకాన్ని ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల పథకంగా ప్రజలు చెప్పుకుంటార అని ఆయన తన లేఖలో తెలిపారు.