ఖండాంతరాలలో ప్రధానమంత్రి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలిటరీ ఆసుపత్రి ధ్రువీకరించగా, సుప్రీం కోర్టు తన తీర్పులో ఉటంకించింది. ఇప్పటివరకు పార్లమెంట్ ప్రివలేజ్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేపట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ప్రస్తావించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలతోపాటు నాపై 124 A కేసు నమోదు చేసిన విషయం తెలిసింది.
ఎల్జి పాలిమర్స్ విషయములో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎవరో ఒకరు వాట్సాప్ లో పెట్టిన సందేశాన్ని రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఫార్వార్డ్ చేస్తే ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి వేధించారు. నలంద కిషోర్, డాక్టర్ సుధాకర్ లను ప్రత్యక్షంగా పరోక్షంగా వేధింపులకు గురి చేసిన విధానం పసిఫిక్ తీరాన ఉన్నవారి చెవులకు చేరింది . ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ మాట్లాడడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసుల అరాచకం పై, ఆలిండియా మానవ హక్కుల సంస్థ ను నేను రెండు సార్లు కలిశాను. అయినా పట్టించుకోలేదు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం కనీసం టైప్ చేసే గుమస్తా కూడా లేని దుస్థితిలో ఉంది . ఇక మానవ హక్కుల ఉల్లంఘనను ఎక్కడ పట్టించుకుంటుంది. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి విదేశీ సంస్థ రాస్తే తెలుసుకోవలసి వస్తుంది.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ పై కూడా సిఐడి ద్వారా కేసులు పెట్టి, పిలిపిస్తారా?. మార్గదర్శి సంస్థ ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్లుగా, అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేస్తానంటారా ??, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సెక్యూరిటీని రద్దు చేయాలని కోరినట్లుగానే, అమెరికా సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ కు రాష్ట్ర శాసనసభాపతి లేఖ రాస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా పార్లమెంట్ ప్రివలేజీ కమిటీ ఏపీ సి ఐ డి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ను పిలిచి విచారించాలి. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు పనిచేయడం లేదని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. పేర్లు పెట్టి వారికి ప్రమోషన్ ఇవ్వద్దు అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, పత్రికలకు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. కేవలం వాట్సాప్ లో వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్ చేసిన వారిపై కేసులు పెడతారు కానీ, అటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉండవు.
న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించిన వారికి ఎటువంటి నోటీసులు ఉండవు. సుప్రీం కోర్టు తాజా తీర్పు స్ఫూర్తితో మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపై పై కారు కూతలు కూసిన, కూయించిన, పత్రికలకు ప్రకటనలు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన వందిమాగాదులపై చర్యలు తీసుకోవాలని రఘు రామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.