వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపి విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా పెట్టిన ఒక కేసులో తాను కేవలం 24 గంటలే జైల్లో ఉన్నానని, బాగా స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తి 16 నెలలు, కొద్దిగా స్థాయి తక్కువ ఉన్న మరొకరు 14 నెలలు జైల్లో ఉండి వచ్చారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ఒకరికి 17, మరొకరికి 18 ఛార్జిషీట్లు ఉన్నాయని, తాను అంత గొప్పోణ్ని కాదని రఘురామకృష్ణంరాజు అన్నారు. దొంగ లెక్కలు వేయడంలో ఘనాపాఠి అని అంతా మెచ్చుకుంటున్నారని, అదే గొప్ప క్యారెక్టర్ అయితే తనది అలాంటి క్యారెక్టర్ కాదన్నారు.
మెడలు వంచుతానని కాళ్లు పట్టుకోవడం, ఒకటి చెప్పి మరొకటి చేయడం తనకు చేతకాదన్నారు. నరకాసురుడు, హిట్లర్ బతికుంటే వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా కొందరి పాలన ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
ముఖ్యమంత్రి చుట్టూ ఎందరో శకునిలు ఉన్నారని ఆరోపించారు. మరమ్మతుల పేరుతో తమిళనాడులోని తన గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మూడు గంటలు ఆపుతామంటూ ఆపివేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
16 రోజులు గడిచినా ఆ మూడు గంటలు పూర్తవడం లేదన్నారు. ఇక్కడి సీఎం అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడారని తెలుస్తోందన్నారు.
అక్కడ సీఎం కార్యాలయ అధికారులు.. మీ ముఖ్యమంత్రిని కలవమని నాపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. జులై 26 వరకు వేచి చూడాలని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.