యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లి అక్కడ బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి వచ్చే భారతీయులపై ఎలా చర్యలు తీసుకోవాలా అని ఆ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇలా దుబాయ్ తదితర ప్రాంతాలలో రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు ఉన్నట్లు కూడా బ్యాంకులు గుర్తించాయి. దాంతో కొత్త గా అక్కడ రుణాలకు దరఖాస్తు చేసే మలయాళీలకు రుణాలు ఇవ్వరాదని బ్యాంకులు ఆలోచిస్తున్నాయి.
కొత్త రుణాల సంగతి ఎలా ఉన్నా ఇచ్చేసిన రుణాలను వసూలు చేసుకోవడానికి కూడా దుబాయ్ బ్యాంకులు మార్గాంతరాలను అన్వేషిస్తున్నాయి. భారీగా రుణాలు తిరిగి రాకపోవడంతో యుఎఇలోని బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. ఎమిరేట్స్ ఎన్బిడి, ఫస్ట్ గల్ఫ్ బ్యాంక్, దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబి, అబుదాబి కమర్షియల్ బ్యాంక్, మష్రిక్ బ్యాంక్ లు ఇలా మలయాళీలు ఎగవేసిన రుణాలతో దివాలా స్థితికి చేరాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఈ బ్యాంకులను గతంలో రుణాల వసూలును భారతదేశంలోని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాయి. అయితే 2018 లో కేరళ హైకోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. భారతదేశంలో రికవరీకి విదేశీ బ్యాంకులకు అర్హత లేదని చెప్పింది. దీంతో కోట్ల రూపాయలు తిరిగి చెల్లించే అవసరం లేకుండా మలయాళీలు ఆనంద పడ్డారు.
1999 లో ఇండియా-యుఎఇ మధ్య జరిగి ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా యుఎఇ ఈ ఏడాది జనవరి 17 న కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రుణాలు ఎగవేసిన వారి ఆస్తులను భారత్ లో కూడా జప్తు చేసేందుకు వీలుకలుగుతుంది. దీని కోసం ముంబయిలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో మలప్పురం, పాలక్కాడ్, త్రిస్సూర్ జిల్లాల్లో ఉన్న మలయాళీలు భయపడుతున్నారు. వీరంతా ప్రాథమిక అంచనాల ప్రకారం యుఎఇలోని 55 బ్యాంకుల నుండి దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా రుణాలు పొందారు. దుబాయ్లో బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లించని వారిలో 60 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. అదే విధంగా రుణాలు ఎగ్గొట్టిన వారిలో 70 శాతం మంది దక్షిణ భారతదేశానికి చెందినవారు.