గుజరాత్ లో భారీ ఎత్తున గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు బయట పడ్డాయి. మొత్తం రూ.317 కోట్ల విలువైన నకిలీ నోట్లతో సహా ఆరుగురిని సూరత్ పోలీసులు పట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే వీరి వద్ద 67 కోట్ల రూపాయల పాత నోట్లను కూడా పోలీసులు గుర్తించారు. సెప్టెంబరు 29న అందిన సమాచారం మేరకు అంబులెన్స్లో రూ.25 కోట్ల 80 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సూరత్ రూరల్ సూపరింటెండెంట్ హితేష్కుమార్ హన్సరాజ్ తెలిపారు.
పోలీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఈ సమాచారం అందించారు. ఇద్దరు నిందితుల ఇంట్లో రూ.52 కోట్లు, రూ.12 కోట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. ఈ నోట్లను ముంబై నుండి వికాస్ జైన్, దీనానాథ్ యాదవ్ అనే వ్యక్తులు ఇక్కడకు పంపారు. ముంబయికి చెందిన ఈ నిందితులను కూడా సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 227,04,50,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
67 కోట్ల విలువైన నకిలీ నోట్లు పెద్ద నోట్ల రద్దుకు ముందువి ఉన్నాయి. రూ.67 కోట్లు, రూ.500, రూ.1000 నోట్లతో సహా రూ.317 కోట్ల నకిలీ కరెన్సీతో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ట్రస్టు, కంపెనీ, కమీషన్ పేరుతో ప్రజలను మోసగించినట్లు విచారణలో వెలుగు చూసింది. ఈ నకిలీ నోట్లను ముద్రిస్తున్న ప్రింటర్ను పట్టుకునేందుకు పోలీసులు 2 అదనపు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ రాకెట్లో పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.