రాయలసీమ విద్యార్థి సంఘం(RSU) 5 వ మహాసభల కరపత్రాన్ని రాయలసీమ పోరాట సమితి కార్యాలయంలో కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా 10 వేల కోట్ల నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమలోని అన్నీ రాజకీయపార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత అభివృద్ధి కి సహకరించాలని, రాయలసీమలో ప్రైవేటు పరిశ్రమల స్థాపనతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలని ఆయన కోరారు.
అదే విధంగా రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పూర్తి చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను కరువుకు కేరాఫ్ అడ్రస్ గా మార్చవద్దని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ నియామకాలలో ధర్మకర్తల మండలి లో ప్రకటించిన విధంగా స్థానికులకు 75% ఉద్యోగ నియామకాల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రకటించిన హైకోర్టును తక్షణమే కర్నూలులో ఏర్పాటు చేయాలని ఒక్క రోజు కూడా ఆలశ్యం చేయరాదని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా తిరుపతిలో ఎయిమ్స్ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని ఆయన కోరారు. రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షులు రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 15,16 లలో అనంతపూర్ లో జరిగే 5 వ మహాసభలను విజయవంతం చేయాలని నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.