రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. షాద్నగర్ డిపో నుంచి బస్సులు రాకుండా గేటు వద్ద నేతలు అడ్డుకున్నారు. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ కొనసాగనుంది.
బంద్ కారణంగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండలో వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.