ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టామని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అందుకోసం తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని రక్షించాలంటూ రేపు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, హైదరాబాద్ లో 16న నిరాహార దీక్ష తాను తనతో బాటు మరో నలుగురు నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా 17,18 తేదీలలో డిపోల దగ్గర కార్మికుల సామూహిక దీక్ష చేస్తారని ఆయన అన్నారు. 19 న హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని తాము ఇంత వరకూ చూడలేదని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని, ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని ఆయన అన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.