రైతులు, యువతను పాలకులు విస్మరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. ప్రధానమైన వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాభివృద్ధి దెబ్బతిని ఆర్ధిక ఇబ్బందులు తలెత్తు తున్నాయని తెలిపారు. సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల సంయుక్త సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది.
ఎస్ కె జానిమియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పాలకులు విస్మరిస్తున్నారని వ్యవసాయ రంగ సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుంటే కార్పొరేట్లకు కోటాను కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ వారి సేవలో పాలకులు తరిస్తున్నారని
ప్రసాద్ ఆరోపించారు. భారతదేశ జనాభాలో సగం మంది సుమారు 80 కోట్ల మంది 40 ఏళ్ల లోపు ఉన్నారని వీరి ఉపాధి, ఉద్యోగం, సంక్షేమాన్ని గురించి పాలకులు నోరెత్తడం లేదని ఆయన అన్నారు. యువశక్తి నిర్వీర్యం కావడం ద్వారా దేశ ఉత్పాదక శక్తి క్రమేపి తగ్గుతూ. వస్తుందన్నారు. భారతదేశంలో మొదటి పంచవర్షిక ప్రణాళిక నుంచి యువతకు ఉపాధి
రంగాలపై ప్రత్యేక శ్రద్ధ ఉండేదని మోడీ సైతం రెండు కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు ఉపాధి, ఉద్యోగాల ఊసెత్తడం లేదని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా ఇక ప్రభుత్వ రంగంలో ఉపాధి
కల్పనకు ద్వారాలు మూసేశారని ప్రసాద్ తెలిపారు. కార్మిక వర్గాన్ని నిర్బంధాల వైపు నెట్టివేస్తున్నారని కార్మిక చట్టాలను సవరించి ప్రశ్నించే హక్కును హరించివేస్తున్నారని ప్రసాద్ తెలిపారు. పాలకులు జనామోదం కోసం కాకుండా సంపన్న వర్గాల ఆమోదం కోసమే పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన
హామీలను విస్మరిస్తుందని ఆయన తెలిపారు. పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీని అమలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని జూన్ నాలుగున కొత్తగూడెంలో జరిగే ప్రజాగర్జన సభకు
వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.