మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరేందుకు దాదాపుగా నిశ్చయం అయింది. బిజెపిని ఇంత కాలం ఘాటుగా విమర్శించిన ఈటల రాజేందర్ ఇప్పుడు బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీనీ అమితంగా పొగడాల్సి ఉంటుంది.
ఆ విషయం పక్కన పెడితే ఈటల రాజేందర్ కు బిజెపిలో చేరడం వల్ల లాభం ఉంటుందా? అనే అంశం చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపికి సుమారు 1500 ఓట్లు వచ్చాయి.
అంటే నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బిజెపికి సుమారు 25 వేల ఓట్లు వచ్చాయి.
పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకే తీసుకుంటే ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్ధిగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలవాటంలే 1500 ఓట్ల నుంచి ఎంతో పెరగాల్సి ఉంటుంది.
ఇప్పటికే హుజురాబాద్ లో బిజెపి ని బలపరుస్తూ వచ్చిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ బిజెపి తరపున పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో బిజెపిలోకి ఈటల రాజేందర్ వస్తున్నారు. దాంతో ఆయన బిజెపిని వీడేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
అంతకుముందు నుంచే బిజెపి నుంచి తన అనుచరులను ఆయన బయటకు పంపుతున్నారు. ఇనుగాల పెద్దిరెడ్డి అనుచరులు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈటలతో ఉన్న ఎవరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారని ఇంత కాలం ఊహాగానాలు వినిపించాయి.
ఈటల సొంత పార్టీతో ముందుకు వచ్చినట్లయితే ఆయనకు సహాయం చేసేందుకు చాలా పార్టీలు ముందుకు వచ్చేవి. చాలా మంది ఆయనతో కలిసి వెళ్లేందుకు ముందుకు వచ్చేవారు.
ఇప్పుడు ఇవన్నీ కాదని ఈటల బిజెపిలో చేరడంతో ఆయన వెనక వెళ్లేవారు ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది. ఈటల బిజెపిలో చేరడం వల్ల బిజెపికి లాభం తప్ప ఈటలకు ఎలాంటి లాభం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బిజెపిలో చేరడం వల్ల ఈటలకు వ్యక్తిగతంలా చాలా నష్టం జరుగుతుందని కూడా పరిశీలకులు అంటున్నారు. బిజెపిలో చేరి ఒక్క సారి ఓడిపోతే ఇక ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అవుతుందని కూడా అంటున్నారు.
సొంత పార్టీ పెడితే ఈటల తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఆయన కమలం పార్టీలో నెగ్గుకురావడం కష్టమేనని అంటున్నారు.