టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈటల రాజేందర్ ను ఎలా ఎదుర్కొవాలా అని మల్లగుల్లాలు పడుతుంటే అకస్మాత్తుగా మంత్రి జగదీష్ రెడ్డి పేరు తెరపైకి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఈ ప్రశ్నల వెనుక అసక్తికరమైన కథనం వినిపిస్తున్నది. మంత్రి జగదీష్ రెడ్డిపై ఈర్ష్య, ద్వేషం పెంచుకున్న నల్గొండ జిల్లా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు ఈ మొత్తం కథ వెనుక సూత్రధారిగా చెబుతున్నారు.
నిన్న మొన్నటి వరకూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఈ నాయకుడికి పదవీ కాలం ముగిసిపోవడం, మళ్లీ పదవి దక్కుతుందన్న ఆశ లేకపోవడంతో పదవి ఉన్న జగదీష్ రెడ్డిని బద్నామ్ చేసేందుకు తన తెలివితేటలు మొత్తం వినియోగించి ఈ అంశాన్ని వెలికితెచ్చారని అంటున్నారు. నల్గొండ జిల్లా రాజకీయ నాయకులలో నిన్నటి నుంచి ఈ అంశంపై విస్త్రతంగా చర్చ జరుగుతున్నది.
ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఆ తర్వాత ఆయన వెళ్లి బిజెపిలో చేరబోవడం తెలిసిందే. ఈటల తర్వాత ఎవరు? అనే ప్రశ్నతో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ప్రశ్న సంధించడంతో కొన్ని మీడియా సంస్థలు ఆ అంశాన్ని విస్త్రతంగా ప్రచారం చేశాయి.
‘‘కేసీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి రేపో మాపో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదంటున్నారు. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని హంపీలో జగదీష్ రెడ్డి కుమారుడి బర్త్ డే పార్టీ సందర్బంగా జరిగిన సంఘటనల ప్రకంపనలు టీఆర్ఎస్ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం…’’ అంటూ కథనాలు వెలువడటంతో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి.
జనవరిలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ ఈ కథ పలు మలుపులు తిరిగింది. కర్నాటకలోని హంపిలో జగదీష్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ చేసుకున్నారని ఆ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారని మీడియా కథనాలు వెలువడ్డాయి.
మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా ఈ మొత్తం వ్యవహారంలో చురుకైన పాత్ర పోషించిన నల్గొండ తాజా మాజీ పై ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందని అంటున్నారు.
ఈటల ఎపిసోడ్ తో ఒక్క సారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో విస్పోటనం సంభవించింది. ఇంత పెద్ద స్థాయిలో జిల్లాల్లో టీఆర్ఎస్ లో వర్గ పోరాటాలు జరుగుతున్నాయని వెల్లడి అయినందున ఇప్పుడు ఆ సమస్యపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు.