వనపర్తి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరుగా కొన్నేళ్ల నుండి పని చేస్తున్న అధికారి మహిళా సంఘాలు, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఒక్కో కొనుగోలు కేంద్రం నుంచి రూ.5,000ల చొప్పున, సంవత్సరానికి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు అందాయన్నారు.
ఆ డబ్బును నగదు రూపంలో, ఫోన్ పే ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ పే చేయించుకున్నాడని, దీంతో పాటు మహిళా సంఘాల్లో పనిచేస్తున్న బుక్ కీపర్లు, సీసీలు కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి అయన ఫోన్ పే నంబరుకు లింకు ఉన్న అకౌంటులో వీవోఏల నంబర్ల నుండి వచ్చిన డబ్బులపై, సీసీ, బుక్ కీపర్ల ద్వారా వచ్చిన డబ్బులపై కూడా విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాచాల కలెక్టరును కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ రెడ్డి, బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, గడ్డం శేఖర్, రామన్ గౌడ్, రాందాస్ నాయక్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్