ఎన్ని రోజులు యుద్ధం చేసినా ఉక్రేయిన్ తమ వశం కాకపోవడం రష్యాకు మతి పోయేలా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే రష్యా సైనికులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఉక్రెయిన్ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్ స్కూల్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో మేరియపోల్లోని ఒక ఆర్ట్ స్కూల్పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్ భవనం నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
రష్యా మూకలు ఉక్రెయిన్ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెంచిన విషయం తెలిసిందే. రష్యా బాంబు దాడుల పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు? ఇది నిజంగా ఉగ్రవాదమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుంది” అని హెచ్చరించారు. ఇప్పటి దాకా రష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు చనిపోగా వేల మంది గాయపడ్డారు.