ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా 14 వ మహాసభలు మే 23, 24 తేదీలలో మందస లో జరుగనున్నయని శనివారం నాడు శ్రీకాకుళం లో ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సంగారు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి కె.మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయలేక, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని దీనివల్ల వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
వంశధార కాల్వ వెంటనే మరమ్మతులు చేసి కాల్వ చివరి భూములకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్దానం మరియు గిరిజన ప్రాంతాలలో జీడి పంట తీవ్ర నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఎరువులు విత్తనాలు ధరలు ప్రభుత్వాలు పెంచడంతో వ్యవసాయ రంగం పైన రైతులపైన మోయలేని భారాలు వెయ్యడం మానుకోవాలని హితవు పలికారు.
ఈ నేపథ్యంలో జరుగు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రతినిధి వర్గం చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించబోతున్నారని, దీనికి జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరగాన కొండయ్య తదితరులు పాల్గొన్నారు.