అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారం తెరవెనుక ఉండి ఈ ఇద్దరు కీరోల్ ప్లే చేశారని పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. గతంలో అరెస్టయిన, విచారణకు హాజరైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సజ్జలను A -120గా పోలీసులు చేర్చారు. టీడీపీ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ ఫోన్ వినియోగించారు? ఎవరికైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ ఇద్దరిని ప్రశ్నించనున్నారు.
2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అధికారం ఉందన్న పొగరుతో విధ్వంసం సృష్టించాయి. దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి పక్కన పడేసిన పోలీసులు..తిరిగి టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీని దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
జగన్ ప్రభుత్వం ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని సీఐడీ, పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సూత్రదారి సజ్జలేనని తేల్చారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు పలువురి నేతలు నిందితులుగా ఉన్నారు.