అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో ఛలో నంద్యాల మదీనా మసీద్ వద్ద మైనార్టీలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల పక్ష నాయకులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ.. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలి. జగన్ అధికారం లోకి వచ్చాక మైనారిటీ లపై దాడులు పెరిగిపోయాయి. ఇందులో పోలీసులు కూడా భాగస్వామ్యులుగా ఉండటం బాధాకరం. సలాం తన కుటుంబం తో ఆత్మహత్య చేసుకోవడం కలచి వేస్తుంది. సెల్ఫీ బయటకు రాకుంటే ఇటువంటి అకృత్యాలు బయటకు వచ్చేది కాదు.
ఓట్లతో గెలిచి వారిపైనే దాడులా..
ఎవరి ఓట్లతో అయితే జగన్ గెలిచారో వారి పైనే దాడులు చేస్తారా? ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు… తగిన సమయంలో బుద్ది చెబుతారు. వాస్తవాలు రావాలంటే సిబిఐ తో విచారణ చేయించాలి. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎటువంటి పోరాటానికైనా సిపిఐ మద్దతు ఇస్తుంది.
దాడులను ఖండిస్తున్నాం.. నరహరశెట్టి నరసింహారావు ఏఐసిసి సభ్యులు
రాష్ట్రంలో మైనార్టీ ల పై దాడులను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. రాష్ట్రంలో సలాం ఉదంతం ప్రభుత్వం, పోలీసుల దుందుడుకు చర్యలకు నిదర్శనం. కేసు పూర్వాపరాలను పరిశీలించకుండా అన్యాయంగా అతన్ని వేధించారు. కంచే చేను మేస్తే ..అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మార్చుకుని ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలి. టిడిపి అడ్వకేట్ బెయిల్ వేశారని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి కి సిగ్గుండాలి. ఛీఫ్ మినిస్టర్ హోదాలో ఉండ సీఎం జగన్ చీప్ గా మాట్లాడుతున్నారు.
నాగుల్ మీరా టిడిపి అధికార ప్రతినిధి
మైనారిటీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ వారి ఆధ్వర్యంలో ఛలో నంద్యాలకు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్మీరా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సలాం ఉదంతంలో వైసిపి నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ప్రతి ఒక్కరు చలించిపోయారు. కానీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం స్పందించే సమయం లేదు. దీనిని బట్టి మైనార్టీలపై జగన్ కు ఎంత ప్రేమఉందో తెలిసిపోతోంది. ఘటనకు బాధ్యులైన పోలీసులు, పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన అధికారపార్టీ నేతలను కఠినంగా శిక్షించాలి. బెయిలేబుల్ సెక్షన్లు పెడితే ఏ కోర్టు అయినా బెయిల్ ఇస్తుందనే ఇంగితం మరిచారా? మరి అమరావతి ఉద్యమం, సోషల్ మీడియా పోస్టులో బెయిల్ ఎందుకు రాలేదు. అంటే సెక్షన్ లు ఏ కేసులో ఎలా పెట్టాలో కూడా తెలియడం లేదా సలాం పై ఒత్తిడి తేవడానికి వెనక ఉన్న వ్యక్తులు ఎవరో బయట పెట్టండి సిబిఐ విచారణ ద్వారా నే వాస్తవాలు బయటకు వస్తాయని దుయ్యబట్టారు.