కరోనా వైరస్ ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజా రక్షణకు సైబరాబాద్ పోలీసులు 24 X 7 నిర్విరామంగా, అలుపెరగని సైనికులలా పని చేస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నివసిస్తున్న పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ సూచనల మేరకు స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తూ సైబరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్లు, ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజు వేలాది మందికి నిత్యావసర సరకులను అందిస్తూ అన్నార్తుల ఆకలిని తీర్చుతున్నారు.
అలాగే వారికి కరోనా నుంచి ఎలా బయటపడాలనే అంశాలను వివరించడంతో పాటు మాస్కులను ధరించుట, శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిన్నటి నుంచి నేటి వరకూ 13000 మందికి ఆహార పోట్లాలు, బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు, కూరగాయలు, పప్పు ఉప్పులు, నూనె తదితర సామగ్రి అందజేశారు.
మొయినాబాద్, మియాపూర్, దుండిగల్, నార్సింగి, ఆర్జీఐఏ, బాచుపల్లి తదితర పోలీస్ స్టేషన్ల సిబ్బంది ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్, అందాపూర్ గ్రామాల్లో రాధాస్వామి సత్సంగ్ సహకారంతో ఇన్ స్పెక్టర్ జానయ్య సిబ్బందితో కలిసి 400 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస అసంఘటిత కార్మికులకు TEA Care NGO శిల్ప, రామ్ కుమార్ సహకారంతో ఈరోజు మాదాపూర్ అడిషనల్ డిసిపి వెంకటేశ్వర్లు, ఏసీపీ మియాపూర్ కృష్ణ ప్రసాద్, మియాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్, సిబ్బంది తో కలిసి అసంఘటిత 200 రేషన్ కిట్లను (బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను) అందజేశారు.
నార్సింగి పీఎస్ పరిధిలో ఇన్ స్పెక్టర్ గంగాధర్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, సబ్బులను అందజేశారు. అలాగే గంధంగూడ CAP foundation సహకారంతో 200 మంది దివ్యాంగులకు రేషన్ కిట్లను అందజేశారు. మరోవైపు నెక్నంపూర్, నార్సింగి ప్రాంతాల్లో ని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులను సామాజిక దూరం పాటించేలా లైన్ లో నిల్చోబెట్టారు.
దుండుగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ ఎక్స్ రోడ్ లో దాతలు తారారామ్, మంగిలాల్ ల సహకారంతో ఇన్ స్పెక్టర్ వెంకటేశం, సిబ్బందితో కలిసి 50 మంది వలస కూలీలకు 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఆర్జీఐఏ పోలీసులు కాలి నడకన బయలుదేరిన 6 మంది వలస కూలీలను ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారికి వసతి ఏర్పాట్లు చేశారు. చేవెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న పాలమూరు వలస కార్మికులకు చేవెళ్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు ఆహార పొట్లాలను అందించడంతో పాటు కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే స్థానిక యూనిట్ ఆసుపత్రి వారి సహకారంతో సిబ్బందికి అవసరమైన ఔషధాలను అందజేశారు.