నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం లో గల జాతీయ రహదారిపై నెలకొన్న సమస్యలను పరిష్కరించక పోతే పంతంగి, కొర్లపహాద్ టోల్ ప్లాజాలను దిగ్భంధిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.
ఎన్ హెచ్ ఏ ఐ, జీఎంఆర్ అధికారుల పని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చిట్యాల మున్సిపాలిటీలోని 3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు ఆయన మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూహైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పై పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అనేకసార్లు ఎన్ హెచ్ ఏ ఐ, జీఎంఆర్ ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోవట్లేదంటూ వారిపై మండిపడ్డారు,
వారంలోపు నకిరేకల్ నియోజకవర్గంలోని గుండ్రంపల్లి గ్రామం నుండి కేతేపల్లి మండలం వరకు హైవే పై పేరుకుపోయిన సమస్యలను పూర్తి చేయకపోతే నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలను దిగ్బంధం చేస్తారంటూ హెచ్చరించారు.
వార్డును పారిశుద్ధ్య లోపంలేకుండా తీర్చిదిద్దడానికి ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి, కమీషనర్ ఎమ్ రామ దుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.