ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ శాంతి భద్రతలపై కేంద్రానికి రాసిన లేఖ విషయంలో ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి సాంబమూర్తిని సీబీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
రమేష్ కుమార్ లేఖ కు సంబంధించి పలు ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లేఖలో రమేష్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని, లేఖను తెలుగుదేశం నాయకులు ముగ్గురు కలిసి డ్రాఫ్ట్ చేశారని విజయసాయిరెడ్డి ఆరోపణలలోని ప్రధాన అంశాలు.
సీరియస్ గా విచారణ జరుపుతున్న పోలీసులు
అయితే ఆ లేఖ తానే రాశానని ఇందులో మూడో వ్యక్తి విచారణ అవసరం లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ గా కేంద్రానికి సమాచారం అందించడం తన విధుల్లో ఒక భాగమని ఆయన అన్నారు. లేఖలోని సంతకం కూడా తనదేనని రమేష్ కుమార్ చెప్పినా విజయసాయి రెడ్డి మాత్రం తన కేసును ఉపసంహరించుకోలేదు. పోలీసులు ఆ లేఖ పై సీరియస్ గా విచారణ జరుపుతూనే ఉన్నారు.
ఇప్పటికే సాంబమూర్తి నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ లేఖను ముందుగా లాప్ టాప్ పై టైప్ చేశారని, తర్వాత డెస్క్ టాప్ కంప్యూటర్ కు ఒక పెన్ డ్రైవ్ ద్వారా బదిలీ చేశారని సాంబమూర్తి పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత ఆ లేఖను వాట్సప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్ కు పంపినట్లు చెప్పారు. అక్కడ నుంచి కేంద్ర హోం శాఖ కు వెళ్లిందని వివరించారు.
ఆందోళనలో సాంబమూర్తి కుటుంబ సభ్యులు
పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారని, లాప్ టాప్ నుంచి ఫైళ్లు డిలీట్ చేయగా, డెస్క్ టాప్ ను ఫార్మేట్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఇది అనుమానాస్పదంగా ఉందని సీబీ సిఐడి డీజీ సునీల్ కుమార్ అప్పటిలో చెప్పారు. ఇది ఇలా ఉండగానే సాంబమూర్తిని పోలీసులు అకస్మాత్తుగా ఎందుకు అదుపులోకి తీసుకున్నారో ఆయన కుటుంబ సభ్యులకు అర్ధం కాలేదు. అరెస్టు వారంట్ కానీ తదితర అంశాలు పోలీసులు కుటుంబ సభ్యులకు వివరించి చెప్పలేదు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉండే సాంబమూర్తి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సాంబమూర్తిని పోలీసులు ఏం చేస్తారోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని వారు బయటకు చెప్పేందుకు కూడా భయపడుతున్నారు.