పశ్చిమగోదావరిజిల్లా పెడవేగి మండలం నడిపల్లి పంచాయతీ ఇసుక ర్యాంప్ నుండి 3 నెలలుగా లక్షలాది రూపాయల ఇసుక అక్రమంగా తరలిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీలో పనిచేసే ఒక ఉద్యోగి ఇసుకను కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తున్నామని చెప్పి అక్రమ పర్మిట్లు ఇస్తున్నారని అంటున్నారు.
నడిపల్లి నుండి ఇసుకను తరలిస్తున్న కొన్ని ట్రాక్టర్ లకు పంచాయతీ స్టాంప్ వేసి పర్మిట్ రసీదులు ఇవ్వడానికి ఆ ఉద్యోగి పంచాయతీలో పనిచేసే ఒక ప్రయివేటు ఉద్యోగి ని రహస్యంగా నియమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా అక్రమ ఇసుక అక్రమ రవాణా కు దొంగ చాటు అనుమతులు ఇచ్చినందుకు పంచాయతీ ప్రభుత్వ ఉద్యోగికి డైలీ 1000 రూపాయలు నజారానాగా ఇసుక వ్యాపారులు చెల్లిస్తున్నట్టు గ్రామంలో ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
లక్షలాది రూపాయల ఇసుక అక్రమ రవాణా వెనుక పంచాయతీ లో ఆ ప్రభుత్వ ఉద్యోగి పాత్ర స్పష్టంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.
ఈ ఉద్యోగి పంచాయతీకి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే కొన్ని వర్గాలను కించ పరుస్తున్నట్టు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉద్యోగికి అహంభావం తో పాటు కుల వివక్షత కూడా ఎక్కువేననీ కొంత మంది బలహీన వర్గాలు ఆవేదన చెందుతున్నారు.
నేను చెప్పిందే వేదం నా మాట శాసనం అన్నట్టుగా వ్యవహరించడం గ్రామానికి తలనొప్పిగా మారిందని సామాన్యులు విద్యావంతులు తలలు పట్టుకొంటున్నారని విశ్వసనీయ సమాచారం.
ఈ ఉద్యోగి వెనుక ఉన్న బలమైన నాయకులెవరోగాని గ్రామ ప్రజలు ఇది అడిగినా నేను చెయ్యను ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకొండని అంటున్నట్టు తెలిసింది.
ఈ ధోరణితో గ్రామస్తుల నోళ్లు మూయించి బయట వ్యాపారులతో చేతులు కలిపి రాత్రి వెళల్లోనూ, తెల్లవారు జామున ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కొంత మంది గ్రామస్తులు పంచాయతీ అధికారులను ప్రశ్నించగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పై అధికారుల ఆదేశాలతో తరలిస్తున్నామని చెబుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు.
కలెక్టర్ కార్యాలయం పేరుతో పంచాయతీ స్థానిక ప్రజలు నమ్మించి ఆ నెపం తో వందలాది ట్రాక్టర్ ల ఇసుక ప్రయివేటు వ్యాపారులకు నెలరోజులుగా చాటు మాటుగా తరలిస్తున్నట్టు సమాచారం.
నడిపల్లి రాంపు నుండి ఎన్ని వేల క్యూబిక్ మీటర్ ల ఇసుక తరలిపోయిందో సివిల్ ఇంజనీర్ అధికారులతో కొలతలు వేయిస్తే తెలుస్తుందని గ్రామస్తులు అంటున్నారు.
నిజంగా కలెక్టర్ కార్యాలయానికి ఇసుక అవసరమైతే పట్ట పగలు నెరీదిగా రాజా ముద్ర తో తరలిస్తారు కానీ చీకటి మాటున, తెల్లవారు జామున దొంగ చాటుగా ఇసుక ట్రాక్టర్ లు వెళ్ళవలసిన అవసరమేముందని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
స్థానికంగా ఉండే సామాన్య నిరుపేదలు జగనన్న గృహాల లబ్ది దారులు ఇసుక లేక ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని అంటున్నారు.
తమ్మిలేరు లో పినకడిమి, జానం పేట, విజయరాయి, నడిపల్లి, నత్తా వారిగూడెం రాంపు లలో ఇసుక పుష్కలంగా ఉన్నా పంచాయతీలు అనుమతించడం లేదని ఆయాగ్రామాల నిరుపేదలువాపోతున్నారు.
ఇసుక మాఫియా యథేచ్ఛగా ఈ రాంపులనుండే తరలించుకుపోయి యూనిట్ ఇసుక 5నుండి 6 వేళకు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక మాఫియా పంచాయతీ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఎవరైనా నిరుపేదలు ఇసుక కావాలని పంచాయతీని అడిగితే పేదల నుండి బూడిద కూడా రాదని తెలిసి రాజకీయ నాయకుల అనుమతి లేదని, రాంపు మూసేసామని అధికారులు ఊరుకోవడం లేదని ట్రాక్టర్ లు రాంపు లోకి వెళ్లకుండా గాడి తీయించకుండా తీయించామని అబద్దాలు చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
ఇదే విషయమై పెడవేగి తహసీల్దార్ ని సత్యం న్యూస్ వివరణ కోరగా నడిపల్లి రాంపు నుండి కలెక్టర్ కార్యాలయానికి ఇసుక ట్రాక్టర్ లతో పంపుతున్న విషయం తనకు తెలియదన్నారు.
వెంటనే నడిపల్లి వి ఆర్ ఓ దీప్తి తో మాట్లాడి విధులు సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు. నడిపల్లి నుండి ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఫిర్యాదు లొస్తున్నాయని అన్నారు.
దీనిపై వి ఆర్ ఓ రాంపు మూసేసినట్టు కార్యదర్శి తనకు చెప్పారని తెలపడం విశేషం. వాస్తవానికి నడిపల్లి రాంపు నేటికి మూయలేదు.
ఇదే విషయంపై పెడవేగి ఇంచార్జి ఎం డి ఓ బలరామరాజును వివరణ కోరేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.