శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం పిడత పోలురు గ్రామ పంచాయతీలో ఉన్న పల్లెపాడుదిన్నె లో యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. భూగర్భంలో నుంచి ఇసుక భారీ ఎత్తున తోడేయడంతో ఈ ప్రాంతం అంతా పర్యావరణం దెబ్బతింటున్నది.
ఏడాది కాలంగా ప్రభుత్వ భూముల్లో ఇసక తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆముదాల పాడు చెరువు, పల్లిపాడు దిన్నె గ్రామంలోని ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల లో 30 నుంచి 40 అడుగుల లోతు వరకు మిషన్ల ద్వారా ఇసుకను తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
ఇప్పటికే లక్షలాది రూపాయలు ప్రయివేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయం మండల రెవెన్యూ అధికారులు సైతం తెలియనట్టుగా వ్యవహరించడం గమనార్హం. స్థానిక ప్రజలు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
భూగర్భ ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిడత పోలురు గ్రామపంచాయతీ వాసులు కోరుతున్నారు.