అవసరమైన వారికి ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేసే కార్యక్రమం కృష్ణా జిల్లాలో గురువారం నుంచి అమల్లోకి రానుంది. ముందుగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత అన్ని జిల్లాల్లోను ఈ పథకాన్ని అమలు చేస్తారు. రవాణా సదుపాయం బాధ్యతను కూడా ఏపీఎండీసీనే తీసుకుని కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్రెడ్డి చెప్పారు. ఇసుక కొనుగోలుదారులు భవన నిర్మాణ ప్రదేశం వివరాలు పోర్టల్లో ఉంచి, మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తారు.
దీంతో నిర్మాణ ప్రదేశానికి నేరుగా ఇసుక వచ్చేస్తుంది. బుకింగ్ డబ్బు చెల్లించడంతో పాటు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. రవాణా చార్జీ కూడా ఏపీఎండీసీ నిర్ణయించింది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్నుకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా చార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6 చెల్లించాలి. 30 కిలోమీటర్లకు పైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున రవాణా చార్జీ నిర్ణయించామని ఆయన తెలిపారు.