పట్టణాలలో, గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా కొందరిలో చలనం రావడం లేదు. ఇలాంటి వారే కొల్లాపూర్ మున్సిపాలిటీలో కొందరు ఉన్నారు. వారికి అధికారులు ఎన్ని విధాలుగా హెచ్చరించిన వారిలో మార్పు రావడం లేదు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
అయితే అంత లోనే కొందరు కూరగాయల,పండ్ల వ్యాపారులు రోడ్లపై ఎలాంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా కుళ్ళిపోయిన పండ్లను, కూరగాయలను మెయిన్ రోడ్ డివైడర్ లపై పారవేస్తున్నారు. దానితో ఆ ప్రాంతం అపరిశుభ్రత గా మారుతుంది. అధికారులు హెచ్చరించినా కూడా ప్రతి రోజూ ఇలాగే చేస్తున్నారు. నోరులేని మూగజీవాలు పడేసిన పండ్లకు, కూరగాయలకు అలవాటుపడి మెయిన్ రోడ్ నే అడ్డాగా మార్చుకున్నాయి.
దానివలన వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు ఆ పశువుల నుండి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది. వాహన దారులు కొద్దిసేపు రోడ్డుపైన నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెయిన్ రోడ్ పై డివైడర్ ల మధ్యల వున్న చెట్లను కూడా ఆ మూగజీవాలు పాడు చేస్తున్నాయి. కేవలం ఇదంతా కూరగాయల,పండ్ల వ్యాపారుల వలన ఇవి జరుగుతున్నాయి. వీటిపై అధికారులు సీరియస్ అయ్యారు.
మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య కఠిన చర్యలు
కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా మెయిన్ రోడ్డు పై ఉన్న కూరగాయల, పండ్ల వ్యాపారుల దగ్గరకి శుక్రవారం ఉదయం అధికారులు వెళ్లి వారికి సూచనలు చేశారు. దీంతో అధికారుల మీదికి వ్యాపారులు తిరగబడ్డారు. విషయం కమిషనర్ సోంటే రాజయ్య దృష్టికి పోవడంతో ఆయన సీరియస్ అయ్యారు. తప్పులు చేయడమే కాకుండా అధికారుల మీదికి తిరగబడడంతో కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. వ్యాపారులకు సంబంధించిన సామగ్రిని మున్సిపల్ వాహనంలో కార్యాలయానికి తరలించారు.
ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే50 వేలు ఫైన్..లేదంటే సీజ్
అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ అభవృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రజలను ఎవరు ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. మెయిన్ రోడ్ పై డీసీఎంలు అపి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కుళ్ళిపోయిన కూరగాయలను, చెత్తాచెదారాన్ని ఒక బాక్స్ లో నిల్వ చేయాలన్నారు. మున్సిపల్ చెత్త వాహనంలో వచ్చినప్పుడు అందులో వెయ్యవచ్చు. లేదంటే వాహనం ద్వారా చెత్తను పట్టణం బయట వేయవచ్చు అని చెప్పారు. అలా కాకుండా ఎవరైనా అశుభ్రతకు పాల్పడితే, మెయిన్ రోడ్ పై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే 50 వేలు ఫైన్ విధించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.షాప్ ను సీజ్ కూడా చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్