ఆరోగ్య శాఖ కార్యకర్తలు అతి దారుణమైన అశ్రద్ధ చూపిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. యావత్ మాల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో ఐదేళ్లలోపు వయసు ఉన్న 12 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.
అక్కడి ఆరోగ్య సిబ్బంది పోలియో డ్రాప్స్ బదులు వారి నోట్లో శానిటైజర్ వేయడమే ఇందుకు కారణం గా చెబుతున్నారు.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఇందుకు బాధ్యులైన ఐదుగురు ఆశావర్కర్లను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. యావత్ మాల్ జిల్లా లోని భాన్బోరా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో క్యాంపు నిర్వహించారు.
అప్పటికి 15 రోజుల నుంచి ఆశా వర్కర్లకు పోలియో డ్రాప్స్ ఎలా వేయాలో శిక్షణనిచ్చారు. అయితే తీరా పిల్లలు వచ్చే సరికి అక్కడే ఉన్న శానిటైజర్ తీసుకుని దాన్ని పిల్లలకు తాగించారు.
కరోనా నేపథ్యంలో ఆశా వర్కర్లు చేతులకు శానిటైజర్ రాసుకుని పోలియో డ్రాప్స్ వేయాలని చెప్పామని, అయితే వారు శానిటైజర్ ను పిల్లలకు వేశారని అధికారులు తెలిపారు.