విజయనగరం శిల్పారామం లో తెలుగువారి సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. స్థానిక శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను మన సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా భోగి మంటతో సంబరాలు ప్రారంభమయ్యాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులూ, గాలిపటాలు, బుడబుక్కలు, కోలాటాల నడుమ, సాంస్కృతిక ప్రదర్శనలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, మన సంప్రదాయ వస్తధారణతో వేడుకలకు హాజరై అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ పిండివంటల పోటీలు ఆకట్టుకున్నాయి.
మన సంస్కృతిని కాపాడాలి డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిగా హాజరైన కోలగట్ల మాట్లాడుతూ, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. రైతుల కష్టఫలం ఇంటికి చేరే రోజు కాబట్టి, సంక్రాంతి పండుగను తెలుగువారు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. రైతు బాగుంటేనే సమాజం బాగుటుందన్నది సంక్రాంతి పండుగ చాటి చెబుతుందన్నారు. గతంతో పోలిస్తే మన సమాజం ఆర్థికంగా అభివృద్ది చెందిందని, దాని ప్రభావం పండగపైనా కనిపిస్తోందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లా అభివృద్దికి కృషి చేయడం జరుగుతోందని కోలగట్ల అన్నారు.
మహోన్నత పండుగ సంక్రాంతి: జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
తెలుగువారు ప్రపంచంలో ఏ మూల నున్నా, అత్యంత ఘనంగా జరుపుకొనే మహోన్నత పండుగ సంక్రాంతి అని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, ప్రతీఏటా సంక్రాంతి పండుగను గొప్పగా జరుపుకుంటున్నామని అన్నారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది పంటలు బాగా పండి, రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి హయాంలో గత నాలుగేళ్లుగా పంటలు బాగా పండుతున్నాయని, విత్తు నుంచి ఉత్పత్తి వరకూ, అన్నిట్లో ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండటమే దీనికి కారణమని అన్నారు.