యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక ఫెలోషిప్కు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి ఎంపికయ్యారు. క్షిపణి సాంకేతికతలను స్వదేశంలో అభివృద్ధి చేయడానికి సతీష్ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఫెలోషిప్ అందిస్తున్నట్లు సొసైటీ పేర్కొంది. వైవిధ్యభరితమైన క్షిపణి వ్యవస్థలు, ఏరోస్పేస్ వాహనాలు, గైడెడ్ ఆయుధాలు, విమానయాన సాంకేతికతలను అభివృద్ధి, రూపకల్పనలలో సతీష్ రెడ్డి అందించిన సేవలను ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేసింది రాయల్ ఏరోనాటికల్ సొసైటీ. గత వందేళ్ల అవార్డు చరిత్రలో సతీష్ రెడ్డి భారత్ నుంచి ఎంపికైన తొలి వ్యక్తి కావడం విశేషం.